విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం వేళల్లో మార్పులు చేశారు. ఇవాల్టి నుంచి కొత్త దర్శనం వేళలు అమలులోకి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ ఆంక్షల కారణంగా గత కొన్నాళ్లుగా అమ్మవారి దర్శనం వేళల్ని తగ్గించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో కనకదుర్గ దర్శన సమయంలో మార్పులు చేశారు.
కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం ఇవాల్టి నుంచి తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు సుప్రభాత పూజలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఖడ్గమాలార్చన పూజలు నిర్వహించనున్నారు. ఖడ్గమాలార్చన సందర్భంగా భక్తులను క్యూ లైన్లలో అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. కాగా, ఉచిత దర్శనం టోకెన్లతోపాటు రూ.100, రూ.300 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులను అత్యవసర పరిస్థితుల్లో ఈ క్యూ లైన్లలో దర్శనానికి అనుమతిస్తారు.
తెల్లవారుజామున దర్శనం చేసుకుని స్వగ్రామాలకు వెళ్లేందుకు భక్తులు రాత్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో సేదదీరుతుంటారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతించారు. దాంతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులతో ఆలయ ఈఓ చర్చించి దర్శన సమయాలను మార్చాలని నిర్ణయించారు. ఇకపై ప్రతిరోజు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.