అమరావతి : ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి కోటి ఆర్థిక సహాయం అందించాలని ఏపీ సీఎం జగన్కు ఇవాళ చంద్రబాబు లేఖ రాశారు. విజయవాడ ఘటనపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషుల్ని శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విజయవాడ ఆస్పత్రిలో గ్యాంగ్రేప్ ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోక పోవడంతోనే దారుణం జరిగిందని పేర్కొన్నారు. అత్యాచారం ఘటన గురించి హోంమంత్రికి తెలియక పోవడం విచారకరమని బాబు అన్నారు. బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. మహిళలపై జరుగు తున్న నేరాల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల్లో అగ్రస్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని లేఖలో సీఎంకు గుర్తు చేశారు.