తిరుమల : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu ) స్వాగతించారు. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సరైనదని అన్నారు. ‘సత్యమేవ జయతే,’ ’ ఓం నమో వెంకటేశాయ ’ అంటూ ట్విట్ చేశారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి(Justice BR Gavai), జస్టిష్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని.. ఇందులో రాజకీయ డ్రామా వద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (సిట్)ను కొనసాగించాలా? లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదులిచ్చారు.
లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కేసు విచారణకు సిట్ విచారణ ఒక్కటే సరిపోదని, కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.