అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంపై విపక్షాలు, కేంద్రం చేసిన విమర్శలను ఖండించారు. మానవతప్పిదం అంటూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కెపాసిటి రెండు లక్షల 17 వేల క్యూసెక్కులకు గాను గంట వ్యవధిలోనే మూడులక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని అన్నారు.
ఇంతటి వరదను సీడబ్ల్యూసీ వస్తుందని పసిగట్టలేకపోయిందని ఆయన వెల్లడించారు. విపత్తులను కూడా ప్రభుత్వం తప్పిదం అనడం శోచనీయమని పేర్కొన్నారు. వర్షాలు, వరదల విషయంలో ఏపీ సీఎం జగన్ ఎప్పటకప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు.