అమరావతి : విజయవాడ దాడిలో గాయపడ్డ టీడీపీ నాయకుడు, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ హైదరాబాద్లో పరామర్శించారు. రెండు రోజుల క్రితం దుండగుల దాడిలో కన్ను కోల్పోయిన గాంధీని హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న గాంధీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విజయవాడలో టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు టీడీపీ నాయకులు ఇవాళ సీపీని కలిశారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసు లు నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
నిందితులపై హత్యాయత్నం నమోదు చేయకుండా నామమాత్రపు కేసులు పెట్టారని వివరించారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో గాంధీపై దాడులు జరగడం ప్రజల్లో అలజడి సృష్టిస్తుందని వెల్లడించారు.