అమరావతి : ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు పారిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో జనం గుండెల్లో ఏపీ సీఎం జగన్(CM Jagan) ఉన్నారని , టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
విజయవాడలో అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని దుయ్యబట్టారు. ఏప్రిల్లో ఎన్నికలు, మేలో ఫలితాలు రాగానే చంద్రబాబు, లోకేశ్ తెలంగాణకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ హయంలో ప్రతి సభలకు లక్షలాధి మంది జనం వచ్చేవారని,అదే పరిస్థితి నేడు ఏపీలో జగన్కు కనిపిస్తుందని అన్నారు. ఇటీవల గుడివాడలో చంద్రబాబు సభలకు కనీసం మూడు వేల మంది జనం కూడా రాలేదని విమర్శించారు.
కుట్రలు, కుతంత్రాలు, మోసాలతో నమ్మించే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని వెల్లడించారు. ఓటుకు నోటుకేసులో కేసీఆర్ కేసుపెడతాడన్న భయంతో అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడని ఆరోపించారు.