అమరావతి : దళితులు, పేదలంటే చంద్రబాబుకు ప్రేమ లేదని ఏపీ సీఎం జగన్ (AP Jagan) ఆరోపించారు. విజయవాడలో 125 అడుగులతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి అంబేద్కర్ అహర్నిశలు పాటుపడ్డారని తెలిపారు. ఏపీలో అంటరాని తనం రూపం మార్చుకుందని అన్నారు.
పేదలను దూరంగా ఉంచడమే అంటరాని తనం కాదని, వారి సంక్షేమ, అభివృద్ధిని అడ్డుకోవడం, పథకాల అమలులో వివక్ష చూపడం అంటరాని తనమేనని పేర్కొన్నారు. ఏపీలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు (Chandra Babu) అడ్డుకోవడం కూడా అంటరానితనమే విమర్శించారు. పేద కులాలు ఎప్పటికీ సేవకులుగానే ఉండాలట. పేదలు ఆత్మగౌరవంతో బతకవద్దని, పేదవారు ఇంగ్లిష్ మీడియం చదువద్దని చంద్రబాబు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.
అంబేద్కర్ భావజాలం అంటే పెత్తందార్లకు నచ్చదని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యనించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. రాజ్యసభకు 8 మందిని పంపితే వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికమని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో దళితులకు ఒక్క సెంట్ భూమి ఇవ్వలేదని ఆరోపించారు.