అమరావతి : ఏపీలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు. వైసీపీకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారం ఇస్తే పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద యువగళం-నవ శకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఐదేళ్ల వైసీపీ(YCP) పాలనలో రాష్టాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగి పోతుందని విమర్శించారు. విశాఖ రుషికొండను బోడిగుండుగా మార్చారని, సీఎం విల్లా కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఏపీకి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుతం విశాఖ గంజాయి రాజధానిగా మారిందని దుయ్యబట్టారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారేందుకు కృషి చేస్తామని అన్నారు. ఏపీలో ధరలు విఫరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లి్ందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో అధికారం కోసం కాదని, . ముఖ్యమంత్రి పదవుల కోసం తపించడం లేదని, రాష్ట్రంలో ఖూనీ చేయబడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జత కడుతున్నామని పేర్కొన్నారు. తిరుపతి, అమరావతిలో ఉమ్మడి సభలు పెట్టి టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మానిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.