తిరుమల : తిరుమలలో (Tirumala ) అనంత పద్మనాభవ్రతం ( Anantha Padmanabhavratham) సందర్భంగా శనివారం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.