అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డకు మహర్దశ పట్టింది. ఇప్పటికే దాదాపు 31 జాతీయ రహదారులను అభివృద్ధి చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరో వరాన్ని కూడా ప్రసాదించింది. వారం క్రితమే విజయవాడలో ఫ్లైఓవర్తోపాటు పలు హైవేలను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఇప్పుడు మదనపల్లె-పీలేరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో ఎన్ హెచ్-71 మొదటి దశగా 55.9 కి.మీ మేర మదనపల్లె-పీలేరు రహదారిని నిర్మించనున్నారు.
తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. ఈ క్రమంలో రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మారుస్తే సౌకర్యంగా ఉంటుందని ఎన్నికల సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి భావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కింద NH-71ని మార్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలా ఉండగా, మార్గం మధ్యలో వచ్చే రైల్వే గేట్లకు ఆర్ఓబీల నిర్మాణానికి కూడా అనుమతి లభించింది.