అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న వరద నష్టాలపై ఆర్థికసహాయం చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన రాష్ట్ర సమస్యలను ఏకరవు పెట్టారు. ముఖ్యంగా గత వారం రోజులుగా వర్షాలు, వరదలతో ఏపీలోని గోదావరి తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన వివరించారు.
జీఎస్టీ పరిహారాన్ని ఐదేళ్లు పొడిగించాలని , ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరామని ఆయన వెల్లడించారు. పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు విడుదల చేయాలని, మహిళ రిజర్వేషన్ల బిల్లు ఈ సమావేశాల్లోనే పెట్టాలని కోరామని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని , జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు సీట్ల అంశాన్ని లేవనెత్తామని తెలిపారు.