అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ( Nominations ) పర్వం రెండో రోజు శుక్రవారం పలువురు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా అధికార వైసీపీ, కూటమి అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు (Returning Officers) నామినేషన్లను సమర్పించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ఏమి చేయలేక వైసీపీపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి మంత్రి రోజా (Minister Roja) సెల్వమణి నగరి పట్టణం పుదుపేట్ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర్రావు, తిరుపతిలో ఎంపీ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari), రాజమహేంద్రవరం ఎంపీ సీటుకు బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purendheshwari) నామినేషన్లు వేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్థానానికి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నెల్లూరు గ్రామీణం నుంచి టీడీపీ అభ్యర్థిగా కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి , విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ తరఫున ఆయన భార్య అనురాధ గురువారం నామినేషన్లు సమర్పించారు.