అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. దాదాపు రెండున్నర నెలలుగా అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. ఇవాళ పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో వైఎస్ మనోహర్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఎంపీ అవినాష్ రెడ్డికి మనోహర్ రెడ్డి స్వయానా చిన్నాన్న. ప్రస్తుతం పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్గా మనోహర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయనతోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని సైతం అధికారులు విచారించారు. విచారణ ముగియగానే ఆయన అతిథి గృహం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణ చివరి దశకు వచ్చింది. త్వరలోనే నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.