తిరుమల : తమిళనాడుకు (Tamilnadu) చెందిన నలుగురు భక్తులు గురువారం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించగా వారిని గుర్తించామని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్(Internet Centre) నిర్వాహకుడు అన్నాదురైగా గుర్తించి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు.
పాస్ పోర్ట్ లోని చివరి నెంబర్లు మార్చి ఆన్ లైన్ లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి, అధిక ధరలకు విక్రయించినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామని వెల్లడించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టీటీడీ(TTD) అధికారిక వెబ్సైట్ (Website) ద్వారా మాత్రమే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి దర్శన టికెట్లు నష్ట పోవద్దని కోరారు. భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షిస్తారని తెలిపారు. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందన్నారు . స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ మరోసారి హెచ్చరిస్తోంది.