హైదరాబాద్ : టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరుతో గుడివాడ పట్టణంలో భారీ కటౌట్లు, పోస్టర్లు వెలిశాయి. కొంత మంది యువత కేటీఆర్ యూత్ పేరుతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్స్ వద్ద టీఆర్ఎస్ టు బీఆర్ఎస్, జాతీయ పార్టీని ప్రారంభించిన కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ ఈ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో కేసీఆర్ పార్టీకి పెద్దగా ప్రజా ఆదరణ ఉండదని కొడాలి నాని వ్యాఖ్యానించిన రెండు రోజుల తర్వాత పట్టణంలో ఈ కటౌట్లను ప్రదర్శించడం చర్చానీయాంశంగా మారింది.
ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుతూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య ఆమోదించిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆ పార్టీ నేతలు లేఖను సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు పలువురు ప్రముఖులు హాజరైన విషయం విదితమే.