Thota Chandrasekhar | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి ఊసేలేని పాలనను వైసీపీ కొనసాగిస్తున్నదని, సీఎం జగన్ సర్కారు వైఫల్యాలు రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బుధవారం తిరుపతిలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆరాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే 2022 నాటికి పోలవరం పూర్తి చేసి, జాతికి అంకితమిస్తామని నాడు సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు.
ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఓ వైపు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తుంటే, ఏపీ ప్రభుత్వం ప్రజల నెత్తిన రూ.లక్షలాది అప్పులు రుద్దుతున్నదని ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వైసీపీ సర్కారును రానున్న కాలంలో గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో లోక్సత్తా పార్టీ జనరల్ సెక్రటరీ కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, బెల్లంకొండ సురేశ్బాబు, తాడేపల్లిగూడెంకు చెందిన కొప్పిశెట్టి దుర్గాప్రసాద్తో సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నారు.