Srisailam | శ్రీగిరిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రోత్సవాలల్లో ఏడోరోజు శనివారం శ్రీశైల భ్రమరాంబా దేవిని కాళరాత్రిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. నల్లటి ఛాయాదేహంతో జుట్టు విరబూసుకుని భయంకరంగా ఉండి.. ఆ తల్లి ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే సకలశుభంకరి అని భక్తుల విశ్వాసం.
ఆది పరాశక్తుల్లో ఏడవ రూపమైన కాళరాత్రి అమ్మవారు గాడిదను వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ, ముద్రలతో ఖడ్గం, లోహకంటక (ఇనుప ముండ్లు) ఆయుధాలుగా ధరించి రౌద్ర రూపంలో సకల శుభప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈదేవిని స్మరించడంతోనే భూతప్రేత, పిశాచాదులు భయపడి పారిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అర్చకులు తెలిపారు.
సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనాన్ని అధిష్టించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు వేదపండితులు శాస్ర్తోక్తంగా విశేష పూజాధి క్రతువులు చేసి వాహనసేవను నిర్వహించారు. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగింది.
గ్రామోత్సవంలో భాగంగా గరళకంఠుడు కాళరాత్రి దేవి సమేతుడై ఆలయ ప్రాకారం నుండి మంగళ వాయిద్యాలు కళకారుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, కేరళ పంచవాయిద్యాల మిశ్రమ ధ్వనులు భజనల నడుమ వైభవంగా క్షేత్ర పురవీధుల్లో విహరించారు.
కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారితోపాటు ఈఈ రామకృష్ణ, ఏఈఓలు హరిదాస్, మోహన్, రవికుమార్ పాల్గొన్నారు. అదే విధంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు చేసిన నృత్యాలు సంగీత విభావరిని భక్తులు ఆద్యంతం తిలకించారు.
దసరా శరన్నవరాత్రి మహొత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు ఆదివారం భ్రమరాంబాదేవి అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనమిస్తారు. మల్లికార్జున స్వామివారు నందివాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈఓ పెద్దిరాజు తెలిపారు.