Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. భ్రమరాంబా దేవి నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయ ముద్రలు, ఖడ్గం ధరించి సకల శుభప్రదాయని కాత్యాయని మాతగా భక్తులకు దర్శనమిచింది. కాత్యాయని అమ్మవారిని దర్శించడం వల్ల జన్మజన్మ పాపాలన్ని హరింపబడతాయని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం సాయంత్రం అక్కమహాదేవి అలంకారమండపంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివార్లను హంసవాహనంపై అధిష్టింపజేసి అర్చక వేదపండితులు విశేష పూజలు జరిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహా సంకల్పం పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రాకారోత్సవం, గ్రామోత్సవంలో భాగంగా పుష్పపల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. వివిధ రకాలైన ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి షోడశోపచార పూజాధికాలు చేశారు.
ఆది దంపతులకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులతోపాటు ఉత్తర దక్షిణాది రాష్ట్రాలనుండి వచ్చిన ప్రత్యేక కళాకారులచే జానపదాలు, కోలాటాలు, చెక్కభజన, బీరప్పడోలు, నందికోలు, ఢమరుక నాదాలు, సప్తస్వర విన్యాసాలు వివిధ రకాల కళారూపాలతో ఉత్సవం కన్నులపండుగగా సాగింది. ఆలయ ప్రధాన ద్వారం నుండి గంగాధర మండపం, నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు జరిగిన పుష్పపల్లకిసేవలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ, మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగాయి. పూజా కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, ఏఈవో మోహన్, హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల్లో ఏడవరోజు శనివారం భ్రమరాంబాదేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమిస్తారు. మల్లికార్జున స్వామివారు గజవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.