Srisailam | శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాల్గవరోజు బుధవారం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు యథావిధిగా నిర్వహించినట్లు అర్చక, వేదపండితులు తెలిపారు. భ్రమరాంబాదేవి కుష్మాండ దుర్గగా ప్రత్యేక పూజలందుకుని భక్తులకు దర్శనమిచ్చారు. దేవి అవతారాల్లో కుష్మాండ దుర్గ సాత్విక రూపంలో సింహవాహనాన్ని అధిష్టించి 8 చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల, అమృతకళశాన్ని దాల్చి భక్తులకు దర్శనమిచ్చారని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.
ఈ దేవిని పూజించడంవల్ల సర్వ రోగాలు తొలగిపొయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు వృధ్ధి చెందుతాయని భక్తుల విశ్వాసం. అలాగే సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు కైలాసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహదేవి అలంకార మండపంలో అర్చక వేదపండితులు, కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, ప్రత్యేక హరతులు, షోడశ పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాకారోత్సవంతోపాటు గ్రామోత్సవంలో ఆదిదంపతులు కైలాస వాహనంపై క్షేత్ర పురవీధుల్లో విహరించారు. గంగాధర మండపం నుండి నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగింపు సాగింది. గ్రామోత్సవంలో మేళతాళాలు, డప్పుచప్పుళ్లు, కేరళ కళాకారుల డప్పు విన్యాసాలు చూసేందుకు యాత్రికులు దారి పొడవునా బారులు దీరారు.
అనంతరం కాళరాత్రి పూజ మంత్ర పుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ప్రాకారోత్సవంలో కళాకారులు చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని అధికారులు తెలిపారు. అదే విధంగా కళారాధనలో భాగంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల ఆటపాటలు యాత్రికులను అలరించాయి.
శరన్నవరాత్రుల్లో ఐదోరోజు గురువారం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు స్కందమాతా అలంకారంలో దర్శనమిస్తారు. మల్లికార్జున స్వామివారితో కలిసి శేష వాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈవో పెద్దిరాజు తెలిపారు.