తిరుపతి : తిరుపతిలోని గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు(Brahmotsavams ) అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ గోవిందరాజస్వామి (Govindaraja Swamy) చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తులు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనలు, స్వామివారి వాహనసేవ వైభవంగా కొనసాగింది.
చిన్నశేష వాహనంపై స్వామివారి పాంచభౌతికప్రకృతికి సంకేతమని అర్చకులు వివరించారు. ఐదు తలల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయప్రదమని పేర్కొన్నారు. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కుండలినీయోగ సిద్ధించి, సుఖశాంతులతో ఆనందజీవులతారని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం(Snapana Thirumanjanam) నిర్వహించారు.