అమరావతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి(Kodanda Ramaswamy)వారి బ్రహ్మోత్సవాల్లో (Brahamotsavam) భాగంగా రెండో రోజు శనివారం శ్రీ రామచంద్రమూర్తి వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో(Madastreets) నిర్వహించిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, ఏఈవో గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.