అమరావతి : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు బూస్టర్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొవిడ్ వ్యాప్తి నివారణకు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు. బూస్టర్ డోస్ వ్యవధి తగ్గించడం వల్ల ఫ్రంట్లైన్ వర్కర్లు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఉపయోగంగా ఉంటుందని, డోసు వ్యవధి తగ్గింపుతో చాలా మందిని రక్షించే అవకాశముంటుందని కేంద్రానికి సూచించాలని ఏపీ నిర్ణయించింది.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితులను అధికారులు వివరించారు. . ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎంకు వెల్లడించారు. అన్ని జిల్లాలో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రెండో డోసు వ్యాక్సినేషన్పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. 15నుంచి 18 ఏండ్ల వారికి 100 శాతం వ్యాక్సినేషన్ను పూర్తయిందని, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మరో 5 జిల్లాలో 90శాతానికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి కావస్తుందని పేర్కొన్నారు.