Tirumala | తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేసి ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమన టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదు.. శనీశ్వరుడి విగ్రహమని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వారి ఆరోపణలను భూమన కరుణాకర్ రెడ్డి తిప్పికొట్టారు.
తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని చెబితే.. నాపైనే కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. అలిపిరి పాదాల చెంత పడివున్న విగ్రహం శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అంటున్నారని, శిల్పి చెక్కి పడేశాడని నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వరుడి విగ్రహం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. శనీశ్వరుడు విల్లు, బాణం ధరిస్తాడని స్పష్టం చేశారు. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే అని తేల్చిచెప్పారు.
నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఖాసన ఆగ్రమ శాస్త్రం తెలియని వాళ్లు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే దైవానుగ్రహంతో బోర్డు సభ్యులం అయ్యామని చెప్పుకుంటున్నారని అన్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో తాను రెండుసార్లు చైర్మన్, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినప్పటికీ వాస్తవాలే చెబుతుంటానని స్పష్టం చేశారు. హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడినని తెలిపారు. కాబట్టి తనపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరూ నమ్మరని అన్నారు. రాజకీయాల కంటే కూడా తనకు హిందూ ధర్మ పరిరక్షణే ముఖ్యమని తెలిపారు. నేను నాయకుణ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని వ్యాఖ్యానించారు.