Srisailam | కార్తీక మాస పూజలకోసం శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో స్నేహపూర్వకంగా ఉండాలని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, శివసేవకులకు దేవస్థానం ఈవో లవన్న సూచించారు. గురువారం మధ్యాహ్నం రోల్కాల్ సమయంలో సీఎస్వో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో లవన్న మాట్లాడుతూ ఆలయ భద్రతా అధికారితో సహా సెక్యూరిటీ సిబ్బంది తమ రోజువారీ విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.
క్యూలైన్లు, ఆర్జితసేవా టిక్కెట్ కౌంటర్, అన్నదాన భవనం, లడ్డూ విక్రయ కేంద్రాలు, విరాళాల కౌంటర్ల వద్ద యాత్రికులు అడిగే సమాచారాన్ని పూర్తిగా అందించాలని ఈవో లవన్న హితవు చెప్పారు. యాత్రికులను స్వామి అనిగానీ, శివ అని కానీ సంబోధించాలని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది, శివసేవకులు ప్రతి ఒక్కరూ స్వామివారి విభూది, అమ్మవారి కుంకుమలను తప్పక ధరించాలని స్పష్టం చేశారు. గత కొంత కాలంగా యాత్రికుల నుండి వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా విధులు నిర్వహించాలని అన్నారు.
శ్రీశైల మహా క్షేత్ర శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి (శ్రీపాదవల్లభుడు ) గురువారం ప్రత్యేక పూజలు చేశామని ఈవో ఎస్ లవన్న తెలిపారు.
లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేక అర్చనలు శాస్ర్తోక్తంగా జరిపించారు. అటుపై భక్తులకు దర్శనాలు కల్పించారు. కార్తీక మాసం కావడంతో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వస్తున్న యాత్రికులతో సందడి నెలకొంది.
అదే విధంగా దర్శన సమయంలో సిబ్బందికి సహకరించాలని భక్తులు, యాత్రికులను కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తద్వారా భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, ఫాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలు కూడా భక్తులతో సందడిగా మారాయి.
శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా వాసి మేక జానకిరాం తన స్నేహితులతో కలిసి రూ.2 లక్షల డీడీని ఆలయ ఏఈవో హరిదాసుకు అందచేశారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.