కడప : (Badvel By elections) బద్వేలు ఉప ఎన్నిక కరోనా నిబంధనల మధ్య ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా పాల్గొంటున్నారు. మహిళా ఓటర్లు బారులు తీరడం అంతటా కనిపించింది. పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇదే పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోపవరం మండలం బేతాయపల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన చంద్రకళ అనే గర్భవతి క్యూలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే స్పందించిన ఎన్నికల సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. చింతల చెరువులో బీజేపీ ఏజంట్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డిపల్లిలో బీజేపీ ఏజెంట్లను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జిల్లా ఎస్పీ అన్బురాజన్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ ఆరోపించారు.
అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. కొందరు మహిళలు అట్లూరు మండలంలో నకిలీ ఐడీలతో ఓట్లు వేయడానికి రాగా.. పోలీసుల తనిఖీల్లో బయటపడ్డారు. ఆ మహిళలను పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు బయటకు పంపించారు. ఇదే మండలంలో ఎస్ వెంకటాపురంలో బయటి ప్రాంతాల నుంచి ఓటేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీలు చేసి కొందరిని పట్టుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.
బద్వేల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతున్నది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పనతల సురేశ్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.
నవంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?!
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
వడోదరలో ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..