అశ్వారావుపేట, ఏప్రిల్ 5: బంధువుల ఇంట్లో జన్మదిన వేడుకలకు హాజరయ్యాక తిరిగి స్వగ్రామానికి ప్రయాణమైన బావ, బావమరిదిని మృత్యువు కబళించింది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటి రామన్నగూడెం గ్రామానికి చెందిన మడకం సంతోష్ (19), పండు సందీప్ (20) కూలి పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం చిచ్చొడుగుంపు లోని సంతోష్ మేనమామ చిచ్చోడు సత్తిపండు కుమార్తె జన్మదిన వేడుకలకు ఆదివారం సంతోష్, సందీప్ కలిసి హాజరయ్యారు.
వేడుక అనంతరం ఇద్దరూ సాయంత్రం బైక్పై తమ స్వగ్రామం బయలుదేరారు. మార్గమధ్యలో అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం శివారు లో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సంతోష్ సోదరి, సందీప్ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. త్వరలోనే వివాహం చేయాలని నిర్ణయించారు.