విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కొందరు దాడి చేశారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. విజయవాడలో పట్టాభి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు.
మంగళవారం ఉదయం ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టాభి.. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసులునోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు, రాష్ట్రప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాటలను తప్పుపడుతూ టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై కూడా కొందరు దుండగులు దాడి చేశారు. కార్యాలయం ఎదుట ఉన్న ప్రముఖుల కార్లను ధ్వంసం చేశారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం.