అమరావతి: ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద సెబ్ అధికారులు రూ.5 కోట్ల విలువ గల బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సును పోలీసులు చెక్పోస్టు వద్ద తనిఖీ చేశారు. నలుగురు ప్రయాణికుల వద్ద 8.250 కిలోల బంగారం బిస్కెట్లు, 28.5 కిలోల వెండిని గుర్తించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా రూ. 90లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణానికి చెందిన దేవరాజు, కుమారవేలు, మురుగేశన్, సేల్వరాజ్, వెంకటేశ్ ఎలాంటి పత్రాలు లేకుండా బంగారం, వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.