తిరుమల : రథ సప్తమి (Rathasaptami ) వేడుకల సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. తిరుమలలో స్వామివారితో అమ్మవార్లు సప్త వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనం, హంస వాహనం, అశ్వ వాహనం, గరుడ వాహనం, చిన్న శేష వాహనం, చంద్రప్రభ వాహనం, గజ వాహన సేవలను నిర్వహించనున్నామని వివరించారు.
తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, చంద్రగిరిలోని కోదండరామ స్వామి వారి దేవాలయంలోనూ, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకలను ప్రతి సంవత్సరం మాదిరిగా ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. వేడుకల సందర్బంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని అధికారులు పేర్కొన్నారు.