APSRTC | ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా 12 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కడప – తిరుమల మధ్య నడిచే ఈ సర్వీసులను ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి సోమవారం కడప డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొత్తం 12 బస్సులకు గానూ 6 బస్సులు నాన్స్టాప్గా నడవనున్నాయి. ఈ 12 బస్సులు తెల్లవారుజామున 4:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. కడప నుంచి తిరుమలకు పెద్దలకు అయితే రూ. 340, పిల్లలకు అయితే రూ. 260 చొప్పున ఛార్జీ వసూలు చేయనున్నారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని డిపోల్లో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇప్పటికే తిరుమల – తిరుపతి మధ్య 50 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ – తిరుమల మధ్య 14, తిరుపతి – మదనపల్లె మధ్య 12, తిరుపతి – నెల్లూరు మధ్య 12 బస్సులు నడపనున్నట్లు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.