Kakinada | ఏపీలోని కాకినాడలో దారుణం జరిగింది. గాంధనగర్ సమీపంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు(46)ను దుండగులు గొంతు కోసి హతమార్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీఎస్పీ విభాగంలో నాగేశ్వరరావు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో పాల్గొనేందుకు అర్ధరాత్రి సమయంలో గాంధీనగర్ నుంచి నడచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడ మాటు వేసిన పలువురు దుండగులు ఒక్కసారిగా నాగేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. పదునైన కత్తితో అతని కొంతు కోసి క్రూరంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న నాగేశ్వరరావును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నాగేశ్వరరావుకు ఎవరితోనైనా పాతకక్షలు ఉన్నాయా? విధి నిర్వహణలో ఎవరినైనా ఎదిరించినందుకు దాడి చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.