Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు రేపు ( ఈ నెల 19వ తేదీన ) విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనుంది.
ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇక మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.