Group 2 Mains | ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విషయంలో గందరగోళం నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ.. ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోస్టర్లో తప్పులు సరిచేయాలన్న అభ్యర్థుల డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఆదివారం జరగాల్సిన పరీక్ష వాయిదా పడిందని ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే ఏపీపీఎస్సీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడుతుందన్న వార్తలను నమ్మొద్దని అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది. రేపు యథాతథంగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. పేపర్ 1 పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు , పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. దీంతో అభ్యర్థులు అయోమయంలోకి వెళ్లిపోయారు.
Group2
నిజానికి రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షల నిర్వహణపై అభ్యర్థులు కొద్దిరోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే నెల 11వ తేదీన విచారణకు రానుంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవేట్ వేసేందుకు ఇంకా సమయం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిదని చంద్రబాబు సర్కార్ భావించింది. ఇదే విషయమై ఏపీపీఎస్సీ సెక్రటరీకి శుక్రవారం నాడే లేఖ రాసింది. రోస్టర్ అంశం నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని లేఖలో కోరింది. కానీ ప్రభుత్వం రాసిన లేఖను ఏపీపీఎస్సీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఏపీపీఎస్సీ వినిపించుకోకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించకుండా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.