తిరుపతి : టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వివిధ పారాయణాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించిందని తెలిపారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు. గ్రామస్తులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందజేస్తామన్నారు.
మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహక కమిటీల సభ్యులు విశ్వనాథ్, మల్లీశ్వరి, రాములు, జేఈవో సదా భార్గవి, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, సీఈవో షణ్ముఖ్ కుమార్, ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి తదితరు సభ్యులు పాల్గొన్నారు.