హైదరాబాద్: ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ అయ్యారు. పార్టీ నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, జేడీ శీలంతో కలిసి ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల.. నేడు తాను చేయబోయే దీక్షకు హాజరు కావాలని ఆహ్వానించారు. తమ పోరాటానికి మద్దతుగా నిలవాని కోరారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుతోపాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏపీ భవన్లో షర్మిల దీక్ష కొనసాగనుంది. ఇందులో ఆమెతోపాటు ఏపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ ఠాకూర్, పార్టీ నాయకులు పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేతను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అంశాన్ని, రాష్ట్రంలోని పరిస్థితులను పవార్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం, హామీల అమల వంటి అంశాలను ఎన్సీపీ తరపున పార్లమెంట్లో లేవనెత్తాలని కోరారు. అనంతరం డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను కూడా కలిశారు.