అమరావతి : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటం చేస్తుంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం మోకరిల్లారు అని ఏపీ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం భాధాకరం అన్నారు. ఏపీకీ ఇంత తీవ్రంగా అన్యాయం జరుగుతున్నా ఇక్కడి నేతలు స్పందించకపోవడం దారుణం అని మండిపడ్డారు.
మోదీకి మోకరిల్లి జగన్, చంద్రబాబు విభజన సమస్యలపై నిలదీయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీపై పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం బీజేపీనీ నిలదీస్తూ డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఏపీకి న్యాయం జరుగుతుందని రాయపాటి జగదీశ్ స్పష్టం చేశారు.