అమరావతి : ఏపీకి ద్రోహం చేస్తున్న వ్యక్తుల ఆటలను ఆటకట్టించాలంటే రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ ఏకతాటిపైకి రావాలని, ప్రజాచైతన్యంతో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అఘాత్యాలను, నష్టాలను ప్రశ్నించే వారిని జైలుకు పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ వచ్చాక రాజ్యంగ వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పరిస్థితిని ప్రజలు, ఉద్యోగులు ఆలోచించుకోవాలని మీడియా సమావేశంలో సూచించారు.
గడిచిన రెండు సంవత్సరాల 9 నెలల్లో రాష్ట్ర అప్పును మూడు లక్షల14వేల కోట్ల నుంచి 7లక్షల కోట్ల వరకు అప్పు చేశారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ప్రజలపై పన్నులు వేశారని విమర్శించారు. పేదలపై ఒక్కొక్కరికీ నెలకు 5 నుంచి 10వేల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్థిక సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. పోలవరానికి నిధులు ఎందుకు తీసుకురాలేదని, పోలవరం ప్రాజెక్ట్ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.