విజయవాడ : ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఏపీలోని షెడ్యూల్డ్ కులాల గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్ర సగటు కంటే అధికంగా ఫలితాలు సాధించడం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. 84.34 శాతం ఫలితాలు సాధించి నెల్లూరు జిల్లాలోని గురుకుల కళాశాల ప్రథమ స్థానంలో నిలిచింది. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 11,776 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా.. 6,713 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే రెండో ఏడాది పరీక్షలకు 10,958 మంది విద్యార్థులకు గాను 7,745 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల పాస్ సగటు శాతం 54. కాగా, గురుకుల పాఠశాల విద్యార్థుల పాస్ శాతం 57గా ఉన్నది. సీనియర్ ఇంటర్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాల విద్యార్థుల శాతం 70.67గా ఉండటం విశేషం. గురుకుల పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,229 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,941 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
పార్వతీపురం జిల్లా కొమరాడ గురుకుల పాఠశాల, బాపట్ల జిల్లా నిజాంపట్నం గురుకుల పాఠశాలల్లో జూనియర్ ఇంటర్ విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించడం శుభపరిణామమని కళాశాల విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో నిజాంపట్నం, కొమరాడ కాలేజీలతో పాటు అన్నమయ్య జిల్లాలోని దేవపట్ల గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. నెల్లూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలు 84.34 శాతం, కృష్ణా జిల్లా 77.25 శాతంతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఎస్సీ గురుకులాల్లో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం సంతోషదాయకమని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.