అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం తరపున పోలాండ్, హంగేరీలకు పంపేందుకు ప్రతినిధులుగా పలువురు అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి నియమించారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థుల వివరాలను ఏపీ సర్కార్ ఇప్పటికే విదేశాంగ శాఖకు అందజేసింది.
ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి ఏడు రోజులుగా కొనసాగుతున్నది. ఈ భీకర పోరులో ఇరుదేశాల సైన్యాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. యుద్ధం తీవ్రం కావడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా ప్రాజెక్ట్ చేపట్టి భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించాలని నిర్ణయించింది.
కాగా, ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంలో మంగళవారం రష్యా దాడిలో కర్ణాటక హవేరీ జిల్లాకు చెందిన నవీన్ శేఖరప్ప అనే విద్యార్థి మరణించాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై సహాయక చర్యలను వేగవంతం చేసింది. మరోవైపు, ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం భారతీయ వైమానికదళం విమానాన్ని మోహరించింది. ఈ ఉదయం వరకు 2,500 మందిని తరలించినట్లు తెలుస్తున్నది.