YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటిపై గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయ్యిందని అనుకుంటున్నామని తెలిపారు. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అభిప్రాయపడ్డారు. హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే అని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్నగర్కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలోనే ఓ ఆగంతకుడు జగన్పై రాయిని విసిరారు. అత్యంత వేగంగా వచ్చిన రాయి.. జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై తగిలింది. జగన్తో పాటు పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. ఏపీ సీఎం జగన్కు వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అయితే జగన్పై క్యాట్ బాల్తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రథమ చికిత్స అనంతరం జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. కాగా, జగన్పై దాడిని వైసీపీ నేతలు ఖండించారు. జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే ఇలాంటి పిరికిపంద చర్యకు దిగాయని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వైసీపీ విమర్శించింది. కార్యకర్తలు అందరూ సంయమనంగా ఉండాలని సూచించారు. ఈ దాడిపై రాష్ట్ర ప్రజలందరూ మే 13వ తేదీన సమాధానం చెబుతారని పేర్కొంది.