AP News : శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు బిడ్డలను చంపేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాద ఘటన ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి దారుణంగా హత్య చేసింది. ఆపై అదే కత్తితో తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ ఘోరాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న వరలక్ష్మిని హుటాహుటిన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దారుణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.