అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ జారీచేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నెల 24న విశ్వవిద్యాలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం చేయాలని వైస్ చాన్సలర్ నిర్ణయించారు. ఈ మేరకు హోమంలో ఉద్యోగులు స్వచ్ఛంగా పాల్గొనవచ్చని, చందా చల్లించాలని సర్క్యులర్ జారీచేశారు. హోమం కోసం బోధన సిబ్బంది రూ.500, బోధనేతర సిబ్బంది రూ.100 చెల్లించాలని, అంతకు తక్కువగా ఇవ్వొద్దని అందులో పేర్కొన్నారు. దీనికోసం ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్టింగ్ స్టాఫ్ సంఘం కార్యదర్శిని నియమించడం గమనార్హం. అయితే ఈ ఉత్తర్వులపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
మృత్యుంజయ హోమం చేయాలని వీసీ తీసుకున్న నిర్ణయాన్ని, అందుకోసం చందాలు అడగడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. విశ్వ విద్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని, ఈ నిర్ణయాన్ని వీసీ, రిజిస్ట్రార్ వెనక్కితీసుకోవాలని స్పష్టం చేశారు. హోమాలు, యాగాలు, శాంతి పూజలు చేయడానికి బదులు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలని మండిపడ్డారు.
అయితే వర్సిటీలో హోమం చేయడంపై రిజిస్ట్రార్ లక్ష్యయ్య స్పందించారు. ఈ కార్యక్రమంతో విశ్వవిద్యాలయానికి సబంధం లేదన్నారు. దీనికోసం వర్సిటీ నిధులను ఖర్చు చేయడం లేదని చెప్పారు. హోమం చేయడం వారి వ్యక్తిగతమని తెలిపారు. ఇందులో పాల్గొన్నాలని, చందాలు ఇవ్వాలని ఎవ్వరినీ బలవంతం చేయడంలేదని చెప్పారు. తమ పేరిట పూజ చేయించుకోవాలని అనుకునే వారు మాత్రమే చందాలు ఇవ్వొచ్చన్నారు. ఇటీవల వర్సిటీలో చాలా మంది బోధన, బోధనేతర సిబ్బంది అకాల మరణం చెందిన నేపథ్యంలో మృత్యుంజయ హోమం నిర్వాహించాలని అనుకున్నట్లు తెలిపారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.