AP News : వాయువ్య బంగాళాఖాతం (Bay of Bengal), దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్ (West Bengal), ఒడిశా (Odisha), ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ (APSDMA) తెలిపింది.
సముద్రం అలజడిగా ఉండి, కెరటాలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీచేసింది. ఐఎండీ నివేదిక ప్రకారం.. ఆగస్టు 23 ఆదివారం ఉదయం నాటికి ఈ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలోనే స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి కూడా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా కొనసాగుతుండటంతో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.