ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు కారులో తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో వారి కారు అదుపుతప్పి లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అనిమిరెడ్డి, గురవమ్మ, అనంతమ్మ, ఆదిలక్ష్మి, నాగిరెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.