Bird Flu| ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని మూడు గ్రామాల్లో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో గత కొన్నిరోజులుగా అసాధారణ రీతిలో కోళ్లు మరణించడం స్థానికంగా ఆందోళన కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మరణించినట్లుగా నిర్ధారించారు.
అనుమానంతో మృతి చెందిన కోళ్ల నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్ గల హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్కు పంపించగా.. బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో చనిపోయిన కోళ్లు అన్ని కూడా బర్డ్ ఫ్లూతోనే మరణించినట్లుగా అధికారులు ధృవీకరించారు. అమ్మగారిపల్లె, పుట్టవారిపల్లె కోళ్లు బర్డ్ ఫ్లూతోనే మరణించాయని నిర్ధారణ అయ్యిందని, కంభంవారిపల్లె గ్రామంలో చనిపోయిన కోళ్లకు చనిపోయిన కోళ్ల నివేదిక రావాల్సి ఉందని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపారు.
ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్షించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన కోళ్ల ఫారాల రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటించిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా పరిధిలో ఎక్కడైనా కోళ్లు అసాధారణ రీతిలో మరణిస్తే 70139 14401, 93982 62752 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
బర్డ్ ఫ్లూతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి మీద ఉడికించిన మాంసంలో వైరస్ ఉండదని.. బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాలని సూచించారు. అయితే వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కనీసం 10 రోజుల పాటు కోడిమాంసం, గుడ్ల తినకపోవడం మంచిదని చెబుతున్నారు.