AP News : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో పాఠశాల విద్యా రంగంపై వైసీపీ అధినేత (YCP Chief) వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల (Govt Schools) నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోతున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ (Union Education Ministry) కు చెందిన యూడైస్ ప్లస్ (UDISE+) గణాంకాలను ఉటంకిస్తూ సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని ప్రచారం చేసుకోవడంపై జగన్ మండిపడ్డారు. ఇది వాస్తవమైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా..? అని ప్రశ్నించారు. కానీ యూడైస్ గణాంకాల ప్రకారం.. 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2025-26 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450 కి పడిపోయిందని, అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని జగన్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా 45 వేల నుంచి 44,222 కు తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీకి నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలతో ఉన్న సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తద్వారా ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం బాటలు వేస్తోందని అనుమానం వ్యక్తంచేశారు.
తమ హయాంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని జగన్ గుర్తుచేశారు. ‘మనబడి నాడు-నేడు’ కింద రూ.8,524 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని, విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూ టోఫెల్ వంటి అంతర్జాతీయ స్థాయి శిక్షణకు సైతం శ్రీకారం చుట్టామని తెలిపారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యారంగం తిరోగమనంలో పయనిస్తుండటం ఆందోళనకరమని జగన్ అన్నారు. ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనాన్ని ఈ లెక్కలే బయటపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.