Srisailam | శ్రీశైలం, ఫిబ్రవరి 10 : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని దేవస్థానం అధికారులను, జిల్లా అధికారులను ఏపీ మంత్రుల బృందం ఆదేశించింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకునే సమయంలో తొక్కిసలాట లేకుండా సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. సోమవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్రూంలో ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్, వీ అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సీవిష్ణు చరణ్, ఉత్సవాల అధికారి చంద్రశేఖర్ ఆజాద్, ఈఓ ఎం శ్రీనివాసరావుతో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతుల కల్పనా ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనమయ్యేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఆ మేరకు వసతులు కల్పించాలని దేవస్థాన అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పలు దేవాలయాల బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి భక్తునికి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుండి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు, దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు. 11 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూ లైన్ నందు భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. పసిపిల్లలు కలిగిన వారికి క్యూలైన్లో ఉన్న మహిళలకు పాలు బిస్కెట్లు అందిస్తామని తెలిపారు.
మహాశివరాత్రి పర్వ దిన వేడుకలు జరిగే 24, 25, 26,27 తేదీల్లో క్యూలైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అంద జేయాలని దేవస్థానం అధికారులను మంత్రి రామ నారాయణ రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు ఆరు డ్రోన్ కెమెరాలను పోలీసు అధికారులకు ఇచ్చేందుకు దేవదాయశాఖ సిద్ధంగా ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షించేందుకు అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
40 కి.మీ మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచు గూడాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచినీరు, బిస్కెట్లు తదితర వసతులు కల్పించాలని అటవీశాఖ అధికారులను మంత్రి రామనారాయణ రెడ్డి ఆదేశించారు. అటవీ చెక్పోస్టులను, దేవదాయశాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ,పోలీస్, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రముఖుల దర్శనాలకు టైంస్లాట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎంఎల్ఏ రాజశేఖర రెడ్డి సూచనలు ఆహ్వానించదగినవని అన్నారు.
ఈ సమావేశంలో ముందుగా దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు పవర్పాయింట్ ప్రెంజేటేషన్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విపులంగా వివరించారు. సోమవారం ఉదయం దేవదాయశాఖ కమీషనర్, రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ ఎస్ చంద్రశేఖర అజాద్ తదితరులు భక్తుల క్యూలైన్లు, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.