అమరావతి : ఇటీవల నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ముగ్గురు సచివాలయంలో ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజనీ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, ఆబ్కారి శాఖ మంత్రి నారాయణ స్వామి సచివాలయంలోని తమ ఛాంబర్లలో పూజలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ .. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 16 మెడికల్ కళాశాలను వీటిని వచ్చే నెలాఖరు లోగా గ్రౌండ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అందుకు తగ్గ విధంగా పనులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ .. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని అన్నారు. దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తానని పేర్కొన్నారు. పేదప్రజలకు సహాయ సహకారాలు సక్రమంగా అందజేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు .
నారాయణ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం కాదు.. బడుగుల రాజ్యం నడుస్తుందని అన్నారు. బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి ఆయన ఫోటోతో సచివాలయ ఛాంబర్లోకి అడుగుపెట్టానని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు అధికారులు హాజరయ్యారు.