ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటరిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు బిల్లులు పెంచడమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించడంపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడే కనీస అర్హత నీకు ఉందా అంటూ నిలదీశారు.
మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని నీకు అప్పగిస్తే వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది నువ్వు కాదా అని జగన్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. నీ అసమర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు. విద్యుత్ హెచ్చుతగ్గులతో ఏపీ జెన్కోను నాశనం చేసింది నువ్వు కాదా .. పీపీఏలను రద్దు చేసి, ఉత్పత్తిదారులను భయపెట్టడంతో కేంద్ర, విదేశీ బ్యాంకుల వద్ద రాష్ట్రం పరువు తీసింది నువ్వు కాదా అని మండిపడ్డారు.
2022-23, 23-24 ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రజలపై మోపాలని డిస్కంలకు అనుమతి ఇచ్చింది నువ్వు కాదా అని జగన్ను గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. డిస్కంలు విద్యుత్ చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతి కోరింది జగన్ హయాంలోనే అని అన్నారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం తాగిన జగన్ మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడు పాలనను విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన తప్పిదాలతోనే అనవసరంగా హిందూజా పవర్ కు రూ.1200 కోట్లు కట్టాల్సి వచ్చిందని మండిపడ్డారు.
జగన్ హయాంలో ప్రతి వ్యవస్థ నాశనమైందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పోలవరం పూర్తి చేస్తానని, మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. తప్పులు అన్నీ వైసీపీ ప్రభుత్వంలో చేసి.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని మండిపడ్డారు.