ప్రకాశం: కుల, మతాలతో రాజకీయాలు చేయడం మంచిదికాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బీజేపీతోపాటు ప్రతి పార్టీ మత సామరస్యాన్ని పాటించాలని కోరారు. స్థానిక నేతలతో కలిసి ఆయన ప్రకాశంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో ప్రధాని మోదీని గద్దె దించేందుకు రాహుల్ గాంధీతో తిరిగిన చంద్రబాబుకు బీజేపీ నేతలు ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఓడిన తర్వాత ఆయన కోవర్టులను బీజేపీలో చేర్చారని విమర్శించారు. నిజమైన బీజేపీ నేతలకు టీడీపీతో కలవాలన్న ఉద్దేశం లేదని చెప్పారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందనడం సరికాదన్నారు. ఆరోపణలు చేసినవారి దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో రూ.100 కోట్ల ఎర్రచందనానికి వేలం నిర్వహించామని చెప్పారు.